వృద్ధుని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్​

by Kalyani |
వృద్ధుని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్​
X

దిశ, చార్మినార్​ : కిరాణ దుకాణం ముందు కుర్చీలు వేసుకోనివ్వడం లేదనే కక్ష్యతో వృద్ధుని హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను కంచన్​బాగ్​ పోలీసులు అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్​కు తరలించారు. శనివారం కంచన్​బాగ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన మీడియా సమావేశంలో కంచన్​బాగ్​ ఇన్​స్పెక్టర్​ శేఖర్​రెడ్డి తో కలిసి చాంద్రాయణగుట్ట డివిజన్​ ఏసీపీ మనోజ్​కుమార్​ వివరాలు వెల్లడించారు. హఫీజ్​బాబానగర్​ సి బ్లాక్​ కు చెందిన జాకీర్​ ఖాన్​ (53) అదే ప్రాంతంలో కిరాణదుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మీర్జా సలీం బేగ్​ కుమారులు మీర్జా ఫహీం బేగ్​ అలియాస్​ ఫహీం (24) , మీర్జా అజీం బేగ్​ అలియాస్​ అజీం (27) లు జాకీర్​ఖాన్​కు చెందిన కిరాణా దుకాణం పక్కనే పాన్​షాపు ను నడుపుతున్నారు. అయితే పాన్​ షాప్ కు వచ్చిన కస్టమర్లను కిరాణ దుకాణం ముందు కుర్చీలు వేసి సిగరెట్​లు తాగనిచ్చేవారు. దీంతో జాకీర్​ ఖాన్​ ఈ విషయంలో వారితో తరచు గొడవకు దిగేవాడు. మా దుకాణం ముందు కుర్చీలు వేయవద్దని, ఈ గిరాకీ దెబ్బతింటుందని పలుమార్లు హెచ్చరించాడు.

దీంతో వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. జాకీర్​ఖాన్​ పై కక్ష్య పెంచుకున్న మీర్జా ఫహీం బేగ్, మీర్జా అజీం బేగ్ లు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుని అవకాశం కోసం ఎదురు చూశారు. ఇంతలోనే ఈ నెల 12వ తేదీన మరోసారి తన వద్దకు వచ్చిన కస్టమర్లకు కిరాణ దుకాణం వద్ద కుర్చీలు వేసి కూర్చోబెట్టాడు. ఆగ్రహించిన జాకీర్​ ఖాన్​ కస్టమర్లు కూర్చుకున్న కూర్చీలను ఒక్కొక్కటి లాగాడు. దీంతో కోపోద్రిక్తులైన మీర్జా ఫహీం బేగ్, మీర్జా అజీం బేగ్ లు ఖుర్షాన్లు జకీర్​ ఖాన్​ ముఖం, ఛాతి భాగాల్లో పిడిగుద్దులు గుద్దారు. ఒక్కసారి కిందపడిన జాకీర్​ ఖాన్​ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మీర్జా ఫహీం బేగ్, మీర్జా అజీం బేగ్ లను అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్​కు తరలించారు. పరారీలో ఉన్న ఖుర్షాద్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును కంచన్​బాగ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed